
తెలంగాణ భూ రక్షణ సమితి జిల్లా అధ్యక్షుడిగా కందికట్ల రాజయ్య నియామకం
రాయపర్తి, జూలై 6 (టీజీ24): తెలంగాణ భూ రక్షణ సమితి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా రాయపర్తి మండలం కొత్తూరు గ్రామానికి చెందిన కందికట్ల రాజయ్య నియమితులయ్యారు. నియామక పత్రాన్ని బుగ్గ మైసయ్య అందజేశారు. అసైన్డ్ భూముల సాగుదారులకు యాజమాన్య హక్కులు కల్పించే దిశగా ప్రభుత్వంతో పోరాడి, జిల్లాలోని సాగుదారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కందికట్ల రాజయ్య తెలిపారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

స్వాతంత్ర్య సమరయోధుడు బాబు జగ్జీవన్ రామ్కు నివాళి
నారాయణపేట్, జూలై 6 (టీజీ24): స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక న్యాయ సాధనకు జీవితాన్ని అంకితం చేసిన బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు. అణగారిన వర్గాల హక్కులు, సమానత్వం, విద్య, ఉపాధి అవకాశాల కోసం ఆయన నిరంతరం పోరాడారు. స్వాతంత్ర్యం అనంతరం రక్షణ, వ్యవసాయ, కార్మిక శాఖల మంత్రిగా, ఉప ప్రధాన మంత్రిగా విశిష్ట సేవలందించారు. యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమానత్వ సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పలువురు పిలుపునిచ్చారు.

నేడు ఖమ్మలో పర్యటించనున్న DGP సివి ఆనంద్
ఖమ్మం, జూలై 07 (టీజీ 24): ఖమ్మం జిల్లాలో నేడు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ పర్యటించనున్నారు. ఖమ్మం పోలీస్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన రహదారి భద్రత అవగాహన కేంద్రాన్ని ప్రారంభించనున్న ఆయన, అనంతరం వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేయనున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వనమహోత్సవంలో పాల్గొని మొక్కలు నాటనున్నారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.

పద్మశ్రీ మందకృష్ణ మాదిగకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన గిద్దె రాజేష్
హైద్రాబాద్, జూలై 07 (టీజీ 24): భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ హైదరాబాద్లోని నివాసంలో పద్మశ్రీ, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగను కలిసి పూలమాలలు వేసి, శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గిద్దె రాజేష్ మాట్లాడుతూ సామాజిక న్యాయం, అణగారిన వర్గాల హక్కుల కోసం మందకృష్ణ మాదిగ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో మరెన్నో సంవత్సరాలు ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు.

మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడిగా కావలి కొండయ్య యాదవ్ ఏకగ్రీవ ఎన్నిక
మండల నూతన సర్పంచ్ల ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో సర్పంచ్ల సంఘం అధ్యక్షుడిగా కావలి కొండయ్య యాదవ్ను ఏకగ్రీవంగా ఎన్నుకోగా, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులను కూడా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా కొండయ్య యాదవ్ మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకానికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, అందరినీ కలుపుకొని మండల అభివృద్ధి కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొని నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.

కడియం శ్రీహరిపై సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు
హైదరాబాద్, జూలై 07 (టీజీ 24): ధర్మాదాయ శాఖ మంత్రికి సమాచారం ఇవ్వకుండా శాఖ అధికారులతో అధికారిక సమీక్ష నిర్వహించారని ఆరోపిస్తూ స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. శాఖా మంత్రిని పక్కనపెట్టి దేవాలయాల అభివృద్ధి, నిధుల కేటాయింపులు, మాస్టర్ ప్లాన్లు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించడం పరిపాలనా విధానాలకు విరుద్ధమని ఆమె పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరారు.

మరపురాని మహానేత వైయస్ఆర్
భద్రాద్రి కొత్తగూడెం, జూలై 08 (టీజీ 24): కగూడెం మండల కాంగ్రెస్ కార్యాలయంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 77వ జయంతిని ఘనంగా నిర్వహించారు. టీపీసీసీ సభ్యుడు డాక్టర్ చందా సంతోష్ కుమార్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్తో కలిసి వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ అమలు చేసిన ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్, ఫీజు రీయింబర్స్మెంట్, ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలను నాయకులు గుర్తు చేశారు. అనంతరం మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా మూడోసారి నియమితులైన సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్తో పాటు జిల్లా కాంగ్రెస్ కమిటీ పదవులకు నియమితులైన నాయకులను, ఇటీవల కాంగ్రెస్లో చేరిన కన్నాయిగూడెం సర్పంచ్ కల్తీ విజయ్ను శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

బల్కంపేట శ్రీ ఎల్లమ్మ ఉత్సవాల పోస్టర్ను ఆవిష్కరించిన మంత్రి కొండా సురేఖ
హైదరాబాద్, జూలై 08 (టీజీ 24): బల్కంపేట శ్రీ ఎల్లమ్మ అమ్మవారి ఆషాఢ బోనాల ఉత్సవాలు, కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. జూలై 20–22 వరకు జరిగే ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు వచ్చే నేపథ్యంలో అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి పాల్గొని ఉత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు.